హైదరాబాద్లో దారుణ హత్య : తల ఓ చోట, మొండెం ఓ చోట
హైదరాబాద్ మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రవీణ్ (24) అనే ఆటో డ్రైవర్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురువారం (ఆగస్ట్ 22, 2019) అర్ధరాత్రి సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. తల ఓ చోట..మొండం ఓ చోట పడేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ప్రవీణ్ ను అతని స్నేహితులు శ్రీను, శ్రీకాంత్లు మద్యం తాగడానికి పిలిచారు. దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం వద్ద మరో వ్యక్తితో కలిసి నలుగురు మద్యం సేవించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న శ్రీను, శ్రీకాంత్లు ప్రవీణ్తో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం..ఘర్షణకు దారి తీసింది. పథకం ప్రకారం..ప్రవీణ్ని చంపేశారు. తల, మొండాన్ని వేర్వేరు చోట్ల పడేశారు.
ఈ విషయం తెలిసిన పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యప్తు చేపట్టారు. ప్రవీణ్ తల, మొండాన్ని పోలీసులు గుర్తించారు. మొండెం మియపూర్లో..తలను బొల్లారం ప్రాంతంలో గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. హత్యకు పాల్పడిన శ్రీను, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.