Vijay Mallya : విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అటుగా వస్తే అప్పగించాలని ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి!
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్-ఫ్రాన్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీట్లో విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది భారత్.
Vijay Mallya : బిలియనీర్ విజయ్ మాల్యా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న మాల్యాను ఇండియాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది కేంద్రప్రభుత్వం. అందులో భాగంగా అటుగా వస్తే విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి చేసింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్-ఫ్రాన్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీట్లో విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది భారత్. కొన్ని షరతులతో అతడిని అప్పగించే అంశాన్ని ఫ్రాన్స్ ప్రతిపాదించగా.. భారత్ మాత్రం బేషరతుగా మాల్యా అప్పగింత జరగాలని కోరిందని ఓ ఇంగ్లీష్ పేపర్లో కథనం వచ్చింది.
ప్రస్తుతం మాల్యా యూకేలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆస్తులు కొనుగోలు చేసిన దేశాలకు వెళ్లనీయకుండా చేయాలని భారత్ నిర్ణయించింది. దీనిలో భాగంగా నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతోంది. ఫ్రాన్స్తో భారత్కు నేరస్థుల అప్పగింతపై గతంలోనే ఒప్పందం ఉంది.
విజయ్ మాల్యా భారత్లో రూ.9వేల కోట్ల బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో..లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొన్నట్లు ఆరోపించింది. ఆ తర్వాత అతను భారత్ను వీడి పారిపోయినట్లు తెలిపింది.
అతడు ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడని..దానికి గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ చెప్పింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థనతో ఈ చర్యలు తీసుకుంది ఫ్రాన్స్.