AP Assembly : 13 రోజులు.. 62 గంటలు, ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
టీడీపీ సభ్యులు 13రోజులుగా.. సారా మరణాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ వారిని ప్రతిరోజూ సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళల...
AP Assembly Adjourned : 13 రోజులు.. దాదాపు 62 గంటలు.. ఆందోళనలు – నినాదాలు.. టీడీపీ – వైసీపీ ఢీ అంటే ఢీ అనే రీతిలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ దఫా సమావేశాల్లో 103 మందిసభ్యులు మాట్లాడగా.. 11 బిల్లులు పాస్ అయ్యాయి. చివరిరోజైన ఇవాళ.. ఏపీ బడ్జెట్ 2022-23ని అసెంబ్లీ ఆమోదించింది. జనరంజకమైన బడ్జెట్ను తీసుకొచ్చారంటూ ప్రభుత్వాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం అభినందించారు. అలాగే.. టీడీపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమించారు. సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్ను నియమించారు.
మరోవైపు మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చామన్నారు సీఎం జగన్ . 2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది 2లక్షల 56 వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు సీఎం జగన్ సభకు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించామని అన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదన్నారు సీఎం జగన్. గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు తమ వెంటే ఉన్నారన్నారు జగన్. అందుకే ప్రతిపక్షం ఉనికి కోసం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. జరుగుతున్న మంచిని ప్రజలు గమనిస్తున్నారని… అందుకే ప్రతీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క మంచి పనీ చేయలేదన్నారు సీఎం జగన్.
Read More : Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు టీడీపీ సభ్యులు 13రోజులుగా.. సారా మరణాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ వారిని ప్రతిరోజూ సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళల తాళిబొట్లు తెంచుతోందంటూ.. మంగళసూత్రాలతో టీడీపీ నిరసన చేపట్టింది. చివరి రోజు మండలిలో టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలు సాగకుండా అడ్డుకోవడంతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అర్జునుడు, రాజనర్సింహులు, అశోక్బాబు, దీపక్రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు. అటు టీడీపీ సభ్యులు మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. టీడీపీ ఎమ్మెల్సీలు సభలోకి తాళిబొట్లు తీసుకు వచ్చి ప్రదర్శించారని .. ఇది మహిళల ఆత్మాభిమానాన్ని అవమాన పరిచడమేనని వైసీపీ మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.