CM Jagan : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ : సీఎం జగన్

రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు.

CM Jagan : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ : సీఎం జగన్

Cm Jagan Review On Grain Procurement Ration Rice Door Delivery

CM jagan review on grain procurement : రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ధాన్యం సేకరణ, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీపై శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్‌ చేయాలని, అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు.

ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు..
ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదన్నారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్తోందన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలని, అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయని తెలిపారు. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్‌ వద్దకు పంపించవద్దని, అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలని సూచించారు. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలని, మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలన్నారు.

రెండు శాఖలు ఓన్‌ చేసుకోవాలి..
ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉందన్నారు. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలని, అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్‌ చేసుకోవాలని తెలిపారు. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలని చెప్పారు. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు. ఈ క్రాపింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ రెండూ కలిసి పనిచేయాలన్నారు.

వ్యవసాయ సలహా కమిటీలు..
వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్‌ చేయాలని, ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలని చెప్పారు. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలని తెలిపారు. ఆ కమిటీల బాధ్యతలు.. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారని.. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదన్నారు.

రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి..
ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలన్నారు. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలని పేర్కొన్నారు. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి.. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదన్నారు.

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ..
రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలన్నారు. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్‌ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌)లు పని చేయాలని సూచించారు. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలని.. కావాల్సినన్ని వేయింగ్‌ స్కేల్స్‌ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయాలని తెలిపారు. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ మిస్‌ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని.. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.