మందుబాబులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ఇక వాళ్లందరూ హ్యాపీగా..

మందు బాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

మందుబాబులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ఇక వాళ్లందరూ హ్యాపీగా..

AP Liquor Policy

Updated On : August 13, 2025 / 8:51 AM IST

AP Liquor: మందు బాబులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్‌లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 273కి అనుమతించింది. పర్మిట్ రూమ్‌లకు సంబంధించి నియమ నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొంది.

పర్మిట్ రూమ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల బహిరంగంగా మద్యపానం చేస్తున్నారని, దీనికారణంగా సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం నవంబర్ 10వ తేదీలోపు 2025-26 సంవత్సరానికి సంబంధించిన లిక్కర్ పర్మిట్ రూమ్ లైసెన్సు రుసుము చెల్లించాలి. దీనికి మద్యం దుకాణాల లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2025- 26 సంవత్సరానికి మాత్రమే ఆ పర్మిట్ రూమ్ లైసెన్స్ వర్తిస్తుందని తెలిపారు.

పర్మిట్ రూమ్ లైసెన్స్‌కు యాన్యూవల్ ఫీజుగా రూ.55లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ.5లక్షలు ఫీజు. అదేవిధంగా రూ.65 నుంచి రూ.85లక్షల రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ.7.50లక్షలు ఫీజు నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్మిట్ రూమ్ ఫీజును మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్ రూమ్ ప్లింత్ ఏరియా వెయ్యి చదరపు అడుగులకు మించకుండా ఉండాలి. ఇది తప్పనిసరిగా మద్యం దుకాణం పక్కనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ పర్మిట్ రూమ్ లలో వంటకాలు అనుమతి లేదు. రెడీ టూ ఈట్ స్నాక్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. తాగునీరు, చేతులు కడుక్కోవడానికి నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మంగళవారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడమే ఈ పర్మిట్ రూమ్ ల అనుమతుల ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న లిక్కర్ పాలసీ రద్దు చేసి కొత్త పాలసీ తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కొనసాగిన క్యాష్ ట్రాన్సాక్షన్ తొలగించిన కూటమి ప్రభుత్వం.. మొత్తం ఆన్‌లైన్, కార్డుల రూపంలోనూ మందబాబులు నగదు చెల్లించేలా చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న మద్యం బ్రాండ్లను కొన్నింటిని తొలగించిన ప్రభుత్వం.. పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.