CM Jagan Target Tekkali : టార్గెట్ టెక్కలి.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష, కచ్చితంగా గెలవాలని ఆదేశం

అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.

CM Jagan Target Tekkali : టార్గెట్ టెక్కలి.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష, కచ్చితంగా గెలవాలని ఆదేశం

CM Jagan Target Tekkali : 2024 ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ నేతలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపై సమీక్షలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి(శ్రీకాకుళం జిల్లా) నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిని జగన్ సమీక్షించారు. 50 మంది కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో రివ్యూ చేశారు సీఎం జగన్. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపిన జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని జగన్ ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన చర్యలను నేటి నుంచే ప్రారంభించాలని కూడా సూచించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం తీరుపైనా జగన్ ఆరా తీశారు. టెక్కలికి గడచిన మూడున్నరేళ్లలో వివిధ పథకాల కింద రూ.1,026 కోట్లను మంజూరు చేసినట్లు జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపైనా సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అద్దంకి నియోజకవర్గంపై సమీక్షించారు.