కూతురిని కొట్టిన తల్లికి ఏడాది జైలుశిక్ష
ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) తీర్పు వెలువరించింది. 2016 డిసెంబర్ 1న కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని రాధికా చౌరస్తాలో జయ, కె.అజయ్, కె.లక్ష్మీ అనే ముగ్గురు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న జయ తన ఏడాదిన్నర కూతుర్ని విచక్షణారహితంగా కొట్టడంతో చిన్నారి తలకు గాయమై రక్తస్రావమైంది.
చిన్నారిపై గతంలో పలుమార్లు ఇదే విధంగా దాడి చేసింది. ఈ ఘటనపై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పానుగంటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి జయ, అజయ్, లక్ష్మీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. తల్లి జయకు ఏడాది జైలుశిక్ష, రూ.1,050 జరిమానా విధించింది. ఏ2, ఏ3లకు 3నెలల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. పోలీసులు నిందితులను జైలుకు తరలించారు.