అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు….చరిత్రలో అత్యంత ఖరీదైనదిగా రికార్డు
2020 U.S. Presidential election to be most expensive in history, అమెరికాలో ఈ ఏడాది జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత డబ్బును అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల ఖర్చు 14 బిలియన్ డాలర్లు(రూ.లక్ష కోట్లు)అని ఎన్నికల్లో ధన ప్రవాహంపై పనిచేసే.. ‘సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్’ సంస్థ అంచనా వేసింది. ఇది అమెరికా ఎన్నికల చరిత్రలోనే రికార్డు అని, 2016 ఎన్నికలతో పోల్చితే రెండింతలు అధికమని తెలిపింది. ఇందులో డెమొక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందాయని తెలిపింది.
ఎన్నికల డొనేషన్లు ఈసారి అత్యధికంగా వసూలవుతున్నాయని తన నివేదికలో సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల్లో బిలియన్ డాలర్ల విరాళాలను సేకరించిన మొదటి అభ్యర్ధిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బిడైన్ నిలవనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 14 వరకు బైడెన్ 93.8 కోట్ల డాలర్లు సేకరించగా.. అధ్యక్షుడు ట్రంప్ కి 59.6 కోట్ల డాలర్లు వచ్చాయి.
స్థిరాస్తి సంస్థలు తప్ప మిగిలిన కంపెనీల్లో అత్యధికం డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపాయని, అధికంగా విరాళాలు ఇస్తున్నాయని వివరించింది. వంద, రెండొందల డాలర్లు ఇవ్వగల సామాన్య పౌరులు కూడా డెమొక్రటిక్ పార్టీకే అధికంగా ఇస్తున్నారని తెలిపింది. డెమొక్రాట్లకు చిన్న చిన్న దాతలు 1.7 బిలియన్ డాలర్లు ఇవ్వగా రిపబ్లికన్లకు కేవలం బిలియన్ డాలర్లు మాత్రమే వసూలయ్యాయి.
మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈసారి విరాళాలు అందించారని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం నిధుల సమీకరణలో మహిళల వాటా 2.5 బిలియన్ డాలర్లు. వీరిలో ఎక్కువ మంది డెమొక్రాట్లకే నిధులు ఇచ్చినట్లు తెలిపింది. 200 డాలర్లకుపైగా ఇచ్చిన వారి నుంచి 1.3 బిలియన్ డాలర్లు డెమొక్రాట్లకు రాగా.. రిపబ్లికన్లకు 57 కోట్ల డాలర్లు అందాయని తెలిపింది. కాగా, 2016 ఎన్నికల్లో మహిళల వాటా 1.3 బిలియన్ డాలర్లు మాత్రమే.
ఇక, ఒక్క అధ్యక్ష అభ్యర్దుల మీద పెట్టే ఖర్చు ఈసారి 6.6 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని, 2016 ఎన్నికల్లో ఇది 2.4 బిలియన్ డాలర్లుగానే ఉందని సంస్థ తెలిపింది. రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్ధులు, గ్రూపులు పెట్టే ఖర్చు 5.5 బిలియన్ డాలర్లు ఉండగా, రిపబ్లికన్లు 3.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేయగలిగారని తెలిపింది. ఇంత పెద్ద తేడా గత ఎన్నికల్లో ఎప్పుడూ లేదని, డెమొక్రాట్లకు నిధుల సమీకరణ అధికంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సారి ఎక్కువగా వర్చువల్ గానే అభ్యర్థులు నిధుల సేకరణ చేపట్టారు. ఈమెయిల్స్, మెసేజెస్ వంటి సేవలపై ఆధారపడ్డారు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి పార్టీలు. రెండు పార్టీలు కలిసి దాదాపు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.