Asteroid Bennu: భారీ ఆస్టరాయిడ్ ‘బెన్ను’ భూమిని ఢీకొట్టే ఛాన్స్.. నాసా హెచ్చరిక!
మహా ప్రళయం ముంచుకొస్తోందా? భూమి అంతమైపోనుందా? ఒకప్పటి డైనోసార్ల మాదిరిగానే జీవం అంతరించిపోనుందా? ఇప్పుడిదే ఆందోళన రేకితిస్తోంది.
Asteroid Bennu : మహా ప్రళయం ముంచుకొస్తోందా? భూమి అంతమైపోనుందా? ఒకప్పటి డైనోసార్ల మాదిరిగానే జీవం అంతరించిపోనుందా? ఇప్పుడిదే ఆందోళన రేకితిస్తోంది. ఎందుకంటే.. అతిభారీ గ్రహశకలం ఒకటి భూమికి అతిదగ్గరగా దూసుకొస్తోంది. ఈ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే చాన్స్ ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సుమారు 6.5 కోట్ల ఏళ్ల క్రితం పది కిలోమీటర్ల వెడల్పు ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. అప్పుడు డైనోసార్లు సహా 75 శాతానికిపైగా జీవం అంతరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందంటూ నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఒసిరిస్-రెక్స్ నాసా అంతరిక్ష నౌక డేటా :
ఆ గ్రహశకలం పేరు ‘బెన్ను’ గా నామకరణం చేశారు. ఈ ఆస్టరాయిడ్పై ‘నాసా’ సైంటిస్టులు పరిశోధనలు జరుపుతున్నారు. ఒసిరిస్-రెక్స్ నాసా అంతరిక్ష నౌక అందించిన డేటా ఆధారంగా.. వచ్చే శతాబ్దంలో బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. గతంలో కంటే భారీ ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఈ బెన్ను వెడల్పు 490 మీటర్లు.. అంటే.. 1600 అడుగులు అనమాట. రాబోయే మూడు వందల ఏళ్ల వరకు భూమికి దూరంగానే వెళ్తుందని భావించగా.. ఇప్పుడు నానా నిర్వహించగా అధ్యయనంలో భాగంగా అంచనాలు తారుమారయ్యాయి. శాస్త్రవేత్తలు గతంలో బెన్నూ-1,700 అడుగుల వెడల్పు (518 మీటర్లు) గ్రహశకలం 2200లో భూమిని ఢీకొట్టే అవకాశం 2,700లో ఒక వంతు ఉందని అంచనా వేశారు. కానీ, 2300 సంవత్సరానికి 1,750లో ఒక వంతు ఉందని అంచనాకు వచ్చారు. బెన్ను అనే గ్రహశకలం 2135 నాటికి భూగ్రహం దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 1.2 ఏళ్లకు ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ ‘బెన్ను’ రెండు సార్లు భూమి కక్ష్యను దాటుతుంది. ఈ క్రమంలో భూమికి అతితగ్గరకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
Asteroid Bennu, the destination of our #OSIRISREx mission, is classified as a hazardous near-Earth asteroid. Data gained from the spacecraft’s visit to Bennu has significantly improved models of its trajectory through the year 2135. https://t.co/4hp3T3eBVa #ToBennuAndBack pic.twitter.com/lMTbT3wBu4
— NASA Solar System (@NASASolarSystem) August 11, 2021
2135ఏడాదిలో భూమిని ఢీకొట్టే అవకాశం :
మన సౌర కుటుంబంలో అంగారక, గురు గ్రహాల మధ్య ఒక ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది. అయితే సుమారు పది లక్షల గ్రహశకలాలు ఇదే కక్ష్యలో తిరుగుతున్నాయి. కొన్ని గ్రహ శకలాలు కక్ష్య మారిన తోకచుక్కల మాదిరిగా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ఆస్టరాయిడ్ ‘బెన్ను’కూడా కక్ష్య మారి భూమికి, అంగారకుడికి మధ్యకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తొలుత 2175-2199 ఏళ్ల మధ్య ఈ బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశం 0.037 శాతం (2,700లో ఒక వంతు) ఉందని సైంటిస్టులు అంచనా వేశారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశం పెరిగిందని అంటున్నారు. 2182వ ఏడాదిలో సెప్టెంబర్ 24న ఢీకొట్టే అవకాశం 1,750లో ఒక వంతు ఉందని గుర్తించారు. 2135వ ఏడాదిలోనూ బెన్ను భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని సైంటిస్టులు అంచనాకు వచ్చారు. అదే సమయంలో భూమి గ్రావిటీ ప్రభావానికి లోనవుతుందని గుర్తించారు. ‘బెన్ను’ కక్ష్య మారితే భూమిని ఢీకొట్టే అవకాశం మరింతగా పెరగడం లేదా తగ్గడం గానీ జరగవచ్చని నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
డైనోసార్ల అంతానికి గ్రహశకలమే కారణం :
2016లో బెన్ను ఉన్న ప్రాంతానికి నాసా ‘ఒసిరిస్–రెక్స్’ వ్యోమనౌకను పంపింది. 2018 డిసెంబర్లో బెన్నును చేరుకున్న అంతరిక్ష నౌక పరిశోధన ప్రారంభించింది. 2020 అక్టోబర్లో బెన్నుపై దిగింది. అందులోని మట్టి, రాళ్లు శాంపిల్స్ను తీసుకుని తిరిగి భూమివైపు బయల్దేరింది. 2023 సెప్టెంబర్లో భూమికి చేరనున్నట్టు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి చేరిన అనంతరం బెన్ను శాంపిల్స్పై పరిశోధనలు చేయనున్నారు. డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైన అతిపెద్ద గ్రహశకలం అప్పట్లో భూమిని ఢీకొట్టింది. దాని పరిమాణం సుమారు 9.6 కిలోమీటర్లు (6 మైళ్లు) వెడల్పు ఉంది. భూమిపై 145 కిలోమీటర్ల వ్యాసంతో అతిపెద్ద క్రేటర్ (గుంత) ఏర్పడింది. ‘చిక్సులుబ్’ అనే ఈ క్రేటర్ మెక్సికోలోని యుకాటన్ ప్రాంతంలో ఉంది. గ్రహశకలం ఢీకొన్న అనంతరం భూమిపై తీవ్ర పరిణామాలు సంభవించాయి. ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తుతో సునామీ సంభవించి భూకంపాలు వచ్చాయి. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగింది. దీని ప్రభావానికి అనేక జంతు జాతులు 75శాతం మేర అంతరించిపోయాయి. అప్పుడే డైనోసార్లు కూడా అంతరించిపోయాయి.
NASA spacecraft: ఆస్టరాయిడ్ శాంపుల్స్ తీసుకుని రిటర్న్ అయిన నాసా అంతరిక్ష నౌక