Pakista PM : తాలిబన్లు సామాన్య పౌరులే : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Talibans normal civilians Pak PM Imran Khan : ‘తాలిబన్లు కూడా సాధారణ పౌరులే..వారిని ఎలా చంపుతాం.. వాళ్లు కూడా మామూలు మనుషులే’ అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని పీబీఎస్ న్యూస్ హవర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తాలిబన్లు మిలిటరీ కాదు. అలాంటి వాళ్లను పాకిస్థాన్ ఎలా అంతమొందించగలదు? అంటూ ప్రశ్నించారు. తాలిబన్లకు పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోందని ఆరోపిస్తున్నారు. వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి?అనే విషయాన్ని వారు ఎందుకు రుజువు చేయరు? పాకిస్థాన్-ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారు. ఇక తాలిబన్లు కూడా సాధారణ పౌరులే. వారేమీ మిలిటరీ కాదు. ఈ శిబిరాల్లో అటువంటి కొందరు పౌరులు ఉంటే.. వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఇమ్రాన్ ప్రశ్నించారు. తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్థికంగా సాయం చేస్తోందని, ఆయుధాలు సమకూరుస్తోందన్న ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఆరోపణలకు పాక్ ఎప్పటికీ సహించదు..ఇటువంటి అవాస్తవ ఆరోపణలు చాలా అన్యాయం అని అన్నారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ అమెరికాపై ఎగిరిపడ్డారు. తప్పంతా అమెరికాదే అంటూ ఆరోపించారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత తాము అమెరికాకు సాయం చేశామని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమవంతు కృషి చేశామని ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరాకి సైన్యాన్ని దింపి దండయాత్ర చేయటం అమెరికా పెద్ద తప్పు చేసిందని ఇమ్రాన్ అన్నారు. పై చేయి ఉన్నప్పుడే తాలిబన్లతో రాజకీయ పరిష్కారం చేయకుండా..అమెరికా మధ్యలోనే వదిలేసిందని ఆరోపించారు.
అమెరికా బలగాలు 10 వేలకు తగ్గాక, ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయే ముందు రాజకీయ రాజీ చేసుకుంటే ఉపయోగం ఏంటీ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తామే గెలిచామంటూ తాలిబన్లు అనుకుంటున్నారని..ఇలాంటి పరిస్థితుల్లో వారితో రాజీకి రాలేమని అన్నారు.ఆఫ్ఘనిస్థాన్ లో పౌర యుద్ధం వచ్చే పరిస్థితులూ ఉన్నాయని ఈసందర్భంగా ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
అటువంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలకు తాము సాయం చేస్తామని అన్నారు. చర్చలకు మాత్రమే సహాయం చేస్తామని..అంతే తప్ప..మిగతా ఎటువంటి విషయాల్లోనూ అమెరికాతో సంబంధాలు పెట్టుకోబోమని ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దేశంలో అమెరికా సైనిక బేస్ ల ఏర్పాటుకూ తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోయేది లేదన్నారు.