ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న యూకే కరోనా స్ట్రెయిన్

ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న యూకే కరోనా స్ట్రెయిన్

UK corona strain : ప్రపంచాన్ని కొత్త రకం కరోనా టెన్షన్‌ పెడుతోంది. కోవిడ్‌ నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. యూకే కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. కరోనా స్ట్రెయిన్‌ మరింతగా విజృంభిస్తోంది. అయితే కరోనా స్ట్రెయిన్‌పై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిడుగులాంటి వార్త చెప్పారు. యూకేలో గుర్తించిన కరోనా స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా.. మరింత ప్రాణాంతకంగా మారుతోందన్నారు. కొత్త కరోనా రకంతో మరణాల రేటు అధికమని గుర్తించినట్లు చెప్పారు. కొత్త స్ట్రెయిన్‌తో 30 శాతం అధికంగా మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడించారు అక్కడి వైద్య నిపుణులు.

ఒక్కో దేశానికి క్రమక్రమంగా పాకుతోంది కరోనా స్టెయిన్‌. యూకే వేరియంట్‌ కరోనా వైరస్‌ ఆనవాళ్లను దాదాపు 60 దేశాల్లో ఉన్నట్లు గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత వారం కన్నా మరో పది దేశాల్లో కొత్త రకం వైరస్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటికే క‌రోనా మృతులు 20 ల‌క్షలు దాట‌డంతో.. కొత్త వేరియంట్‌పై ఆందోళ‌న‌లు వ్యక్తమవుతున్నాయి. యూకే క‌రోనా వేరియంట్ త‌రహాలోనే సౌతాఫ్రికా ర‌కం వైర‌స్ కూడా తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. సౌతాఫ్రికా వేరియంట్ కూడా 23 దేశాల్లో ఎంటరైంది.

రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ గడగడలాడిస్తోంది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ జరుగుతుండగా.. ఈ కొత్తరకం స్ట్రెయిన్‌ వైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. స్ట్రెయిన్‌ కేసులు పెరగకుండా ఉండేందుకు అన్ని దేశాలు చర్యలు చేపట్టాలని చెప్పింది.