ఐపీఎల్ -13 : బెంగళూరుపై హైదరాబాద్ విజయం

  • Published By: bheemraj ,Published On : November 1, 2020 / 12:17 AM IST
ఐపీఎల్ -13 : బెంగళూరుపై హైదరాబాద్ విజయం

ఐపీఎల్ -13వ సీజన్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హైదరాబాద్ 5 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ 14.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవడంతో ప్లేఆఫ్‌ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది.



వృద్ధిమాన్‌ సాహా 32 బంతుల్లో 39 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో పాటు మనీష్‌ పాండే 19 బంతుల్లో 26 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్‌), హోల్డర్‌ 10 బంతుల్లో 26 పరుగులు (1 ఫోర్‌, 3 సిక్స్‌లు) నాటౌట్‌ ఆకట్టుకోవడంతో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌ ఆరో విజయం. పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తుకు ఢోకా ఉండదు.



సాధారణ లక్ష్య ఛేదనలో ఆదిలోనే సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(8) నిరాశపరిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో సాహాకు మనీష్‌ జత కలిశాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మనీష్‌ ఔటయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.



విలియమ్సన్‌(8) విఫలమయ్యాడు. ఉదాన బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటైన క్రమంలో సన్‌రైజర్స్‌లో ఆందోళన మొదలైంది. హోల్డర్‌ మ్యాచ్‌ను గట్టెక్కించాడు. అభిషేక్‌ శర్మ5 బంతుల్లో 8 పరుగులు (1 సిక్స్‌)తో కలిసి 27 పరుగులు జత చేయడంతో సన్‌రైజర్స్‌ ఒత్తిడి క్లియర్‌ అయింది. బెంగళూరు బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీ, ఉదానాలకు తలో వికెట్‌ లభించింది.



టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 120 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్‌ ఫిలెప్పి-
దేవదూత్‌ పడిక్కల్‌లు ఆరంభించారు. అయితే బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి పడిక్కల్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లి(7) కూడా నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ వేసిన మరో ఓవర్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు. ఆ తరుణంలో ఫిలెప్పి- ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 43 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(24) పెవిలియన్‌ చేరాడు. నదీమ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో ఏబీ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫిలెప్పి((32) కూడా ఔట్‌ కావడంతో బెంగళూరు 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.



వాషింగ్టన్‌ సుందర్‌(21) ఫర్వాలేదనిపించడంతో బెంగళూరు 100 పరుగుల మార్కును దాటింది. క్రిస్‌ మోరిస్‌(3), ఇసురు ఉదాన(0)లను ఒకే ఓవర్‌లో హోల్డర్‌ ఔట్‌ చేయడంతో హైదరాబాద్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, నటరాజన్‌, నదీమ్‌, రషీద్‌ఖాన్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.