హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల 5 జిల్లాల పరిధిలో 50వేల మందికి కరోనా టెస్టులు
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. కానీ ఈ వైరస్ చాలా మంది పడుతున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 50 వేల మందికి కరోనా టెస్టులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారం, పది రోజుల్లో కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలు నిర్ణయించాలని సూచించారు. 2020, జూన్ 14వ తేదీ ఆదివారం ప్రగతి భవన్ లో కరోనా వైరస్ కట్టడికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని, మరణాల రేటు కూడా అంతగా లేదని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్, దీని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా నజర్ పెట్టాలన్నారు. ఐదు జిల్లాల పరిధిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.
నగరంలో కరోనా వైరస్ ను అరికట్టాలని, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయాలన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, మలక్ పేట, అంబర్ పేట, సికింద్రాబాద్, కంటోన్ మెంట్, పటన్ చెరు, ముషీరాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో 50 వేల మందికి కరోనా వైరస్ టెస్టులు చేయాలన్నారు సీఎం కేసీఆర్.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా..ప్రైవేటు ల్యాబోరేటరీలు, ఆసుపత్రులను కూడా వినియోగించుకోవాలన్నారు. పాజిటివ్ గా తేలినా…వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేని వారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలన్నారు. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినా..అందిరీక చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.