JBS: మాంసం విక్రయసంస్థ జేబీఎస్పై సైబర్ దాడి.. స్పందించిన వైట్ హౌస్!
జేబీఎస్ అంటే ఒక బ్రాండ్.. మాంసం విక్రయాల్లో ఈ పేరు చాలా పాపులర్. ప్రపంచంలోని 15 దేశాలలో మాంసం అమ్మే చైన్ మార్కెట్లు గల ఈ సంస్థలో ఒకటిన్నర లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. 15 దేశాల్లో 150కి పైగా ప్లాంట్లు కలిగి ఉన్న ఈ సంస్థకు..
JBS: జేబీఎస్ అంటే ఒక బ్రాండ్.. మాంసం విక్రయాల్లో ఈ పేరు చాలా పాపులర్. ప్రపంచంలోని 15 దేశాలలో మాంసం అమ్మే చైన్ మార్కెట్లు గల ఈ సంస్థలో ఒకటిన్నర లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. 15 దేశాల్లో 150కి పైగా ప్లాంట్లు కలిగి ఉన్న ఈ సంస్థకు.. ఆయా దేశాలలోని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, మెక్డోనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ ఔట్లెట్ సంస్థలు కూడా కస్టమర్లే. నెలకు వేలకోట్ల డాలర్ల వ్యాపారం జరిగే ఈ సంస్థ మీద సైబర్ నేరగాళ్ల కన్నుపడింది. మొత్తానికి ప్లాన్ చేసి జేబీఎస్ సంస్థ మీద సైబర్ అటాక్ చేశారు. దీంతో ఆ సంస్థకు సంబంధించి కార్యకలాపాలు ఆగిపోయాయి.
అత్యాధునిక రీతిలో సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపగా.. జేబీఎస్ సంస్థలో ఉన్న అన్ని కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో లాంటి దేశాలలోని జేబీఎస్ మాంస విక్రమ మార్కెట్లను మూసివేశారు. దీంతో వేల సంఖ్యలో కార్మికులపైన ప్రభావం పడగా ఇప్పటికే ఈ ఘటనపై వైట్హౌజ్లోనూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పట్ల ఎఫ్బీఐ విచారణ చేపట్టినట్లు శ్వేతసౌధం పేర్కొనగా రష్యాతో నేరుగా సైబర్ దాడుల గురించి సంప్రదిస్తున్నట్లు వైట్హౌజ్ ప్రతినిధి కరీన్ జీన్ పెరీ తెలిపారు.
రష్యాకు చెందిన క్రిమినల్ గ్రూపు ఈ సైబర్ అటాక్ చేసినట్లు నిర్ధారణకు రాగా.. రాన్సమ్వేర్ వైరస్తో దాడి చేసి ఉంటారని కంపెనీ చెప్తుంది. రాన్సమ్వేర్ సైబర్ దాడితో హ్యాకర్లు కంప్యూటర్ నెట్వర్క్లోకి ప్రవేశించి తమ అధీనంలోకి తీసుకుంటారు. సర్వర్లలోని ఫైల్స్ను డిలీట్ చేయడంతో పాటు కార్యకలాపాలను అడ్డుకుంటారు. క్రిమినల్స్ అడిగిన మొత్తం ఇస్తేనే తిరిగి సర్వర్లను అప్పగిస్తారు. ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం చర్యలకు దిగగా నేరుగా రష్యా ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒక్క జేబీఎస్ సంస్థనే అగ్రదేశం అమెరికాలో పావువంతు బీఫ్ సరఫరా చేస్తుండగా ఇప్పుడు ఆ జేబీఎస్ కార్యకలాపాలకు గండిపడింది. దీంతో పలుదేశాలలో మాంసం సరఫరాలో ఇబ్బందులు తలెత్తనుండగా.. మాంసం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేబీఎస్ వ్యాపారం నిర్వహించే అన్ని దేశాలలో మాంసం సరఫరా, ధరలు, అందుబాటులో చాలా తేడాలు వచ్చే అవకాశం ఉండగా.. ఈ సైబర్ అటాక్ ఎక్కువరోజులు కొనసాగితే జేబీఎస్ సంస్థ వేలకోట్లలో నష్టాలతో పాటు ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.