‘పువ్వల్లే మేలుకున్నది’ పాట రిలీజ్ చేసిన గీతామాధురి కూతురు ‘ప్రకృతి’
FCUK Movie mopuvvalle song released by geeta madhuri Daughter : ప్రముఖ నటుడు జగపతి బాబు, కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత ప్రధాన పాత్రలలో విద్యాసాగర్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. వెరైటీ పేరుతో ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీప్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందుండి అవిశ్రాంతంగా సేవలందిస్తూన్న వైద్య-ఆరోగ్య, మునిసిపల్, పోలీస్, మీడియా సిబ్బంది చేతుల మీదుగా పాటలు విడుదల చేశారు. ఈ పాటలు సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాటలు బాగున్నాయనే టాక్ వచ్చింది.
ఈ పాటల్లో “పువ్వల్లే మేలుకున్నది” అనే పాటను పాపులర్ సింగర్ గీతామాధురి కుమార్తె బేబి ప్రకృతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట చిన్నారులకు..తల్లిదండ్రుల మధ్య అనుబంధానికి సంబంధించినది కావటమే కారణం. ఈ పాటను గీతా, ప్రకృతి పాడారు.
మంచి రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకూ విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ పోస్టర్లు కానీ, టీజర్ కానీ ఆడియెన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.