వెనక్కి తగ్గిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట

వెనక్కి తగ్గిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట

sec nimmagadda withdraw orders: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వంతో సై అంటే సై అన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారి వెనక్కితగ్గారు. రేషన్ సరుకుల డెలివరీ వాహనాల రంగుమార్పు విషయంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను నిమ్మగడ్డ వెనక్కి తీసుకున్నారు. కాగా, ఎస్ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్ఈసీ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు. నిమ్మగడ్డ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో, ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం ప్రభుత్వానికి దొరికింది.

ఏపీలో స్ధానిక సంస్ధలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. వైసీపీ జెండా రంగులు, సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ది చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై ఉన్న పార్టీ రంగులను మార్చాలని ఫిబ్రవరి 5న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.

దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరింది. వాహనాల రంగులు మార్చాలంటే 3నెలల సమయం పడుతుందని, భారీగా ఖర్చవుతుందని, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని కోర్టుకి తెలిపింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పథకం ప్రారంభించామని.. దీన్ని అడ్డుకోకుండా ఎస్‌ఈసీని ఆదేశించాలని ప్రభుత్వం కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.

రేషన్‌ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏపీలో స్ధానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది.