కల్నల్ సంతోష్ అంత్యక్రియల్లో సందిగ్ధత
చైనా సైనికులు చేసిన ఘర్షణలో తెలంగాణ వాసి…కల్నల్ సంతోష్ వీరమరణం పొందారు. అమరుడైన సంతోష్ పార్థివ దేహాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. సంతోష్ వీరమరణం పట్ల..సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సంతోష్ అంత్యక్రియల ఏర్పాట్లు చూడాలని మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించారు. కానీ…ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనేది తెలియరావడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…హైదరాబాద్ లోనే అంత్యక్రియలు జరపాలని అధికారులు సంతోష్ తల్లిదండ్రులకు సూచించారని, కానీ..వారు మాత్రం..సూర్యాపేటలోనే అంత్యక్రియలు జరపాలని అనుకుంటున్నట్లు తెలిపారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. దీనిపై 2020, జూన్ 17వ తేదీ బుధవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కల్నల్ సంతోష్ ను ఇప్పటికే హైదరాబాద్ కు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని తెలుస్తోంది. మూడు సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉండగా..కరోనా నేపథ్యంలో…లడక్ లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని తెలుస్తోంది. సంతోష్ మరణ వార్తను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.
భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి సంతోష్ వీరమరణం పొందారు. 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కుమారుడి వీరమరణంపట్ల తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. కానీ దేశ పౌరురాలిగా మాత్రం గర్వంగా ఉందని సంతోష్ తల్లి వెల్లడించారు.
మంగళవారం ఉదయం లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత్ – చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం..భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. 14వేల అడుగుల ఎత్తున ఈ రెండు అన్వాయుధ దేశాల సైనికులు కర్రలతో, రాళ్లతో తలపడ్డారు. ఈ ఘర్షణలో మృతి చెందిన సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సంతోష్ ఉన్నాడు.
Read: అమరుడైన తెలంగాణ బిడ్డ..కల్నల్ సంతోష్ జీవిత విశేషాలు