CPI Narayana : జూ.ఎన్టీఆర్ పై నారాయణ ఆగ్రహం.. అమిత్ షాను కలవాల్సిన కర్మ ఏంటి?
జూనియర్ ఎన్టీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎన్టీఆర్ కలవడంపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
CPI Narayana : జూనియర్ ఎన్టీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎన్టీఆర్ కలవడంపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, తాత చాలా మంచివారని.. అలాంటి మంచి రాజకీయ ఫ్యామిలీ వ్యక్తి.. నెంబర్ 1 క్రిమినల్ అమిత్ షాను ఎందుకు కలిశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ. అమిత్ షాను కలవాల్సిన కర్మ ఎన్టీఆర్ కు ఏంటి? అని నారాయణ ప్రశ్నించారు. అమిత్ షా పిలిచినా జూ.ఎన్టీఆర్ వెళ్లకుండా ఉండాల్సిందన్నారు.
హైదరాబాద్లోని మగ్ధూం భవన్లో నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ నేతలు వరుసబెట్టి సినిమా హీరోలను కలుస్తున్న అంశంపై నారాయణ స్పందించారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలతో పాటు సినీ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..
ఈ భేటీపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సినిమా తారలను ప్రసన్నం చేసుకుంటున్న బీజేపీ.. వారి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని, వారి ద్వారానే టీఆర్ఎస్ను బలహీనపరచాలని చూస్తోందని నారాయణ అన్నారు.
మరోవైపు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలను నారాయణ స్వాగతించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీని కూడా నారాయణ స్వాగతించారు. ఈ క్రమంలో, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్కు సలహా ఇచ్చారు నారాయణ.
”కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్ ను కలవడం మంచి పరిణామం. ఏపీ సీఎం జగన్ను కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలి. తెలంగాణలో సినీ నటులను బీజేపీ ప్రసన్నం చేసుకుంటోంది. వారి ద్వారా టీఆర్ఎస్ ను బలహీన పరచాలని చూస్తోంది. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉంది. ఆయనకు అమిత్ షాను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని నారాయణ ప్రశ్నించారు.
కాగా, ఇటీవల బీజేపీ సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. జూ.ఎన్టీఆర్ తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. అమిత్ షా, ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా.. షా-ఎన్టీఆర్ భేటీ కచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం కానుందని ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.