Khairatabad Ganesh 2021: తొలి పూజకు సిద్ధమైన ఖైరతాబాద్ మహా గణపతి
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలందుకొనేందుకు సిద్దమయ్యాడు. గతేడాది కరోనా వైరస్ కారణంగా వినాయక ఉత్సవాలను నిర్వహించినప్పటికీ..
Khairatabad Ganesh 2021: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలందుకొనేందుకు సిద్దమయ్యాడు. గతేడాది కరోనా వైరస్ కారణంగా వినాయక ఉత్సవాలను నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో భక్తులు సంతృప్తి చెందలేదు. గత ఏడాది విగ్రహం ఎత్తు కూడా తగ్గించి వేడుకలు నిర్వహించిన నిర్వాహకులు ఈసారి విగ్రహం ఎత్తు 40 అడుగుల వరకు పెంచారు. ప్రముఖ శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలోని శిల్పుల బృందం 40 అడుగుల పంచ ముఖ రుద్ర గణపతి విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పంచముఖ రుద్ర మహా గణపతి విగ్రహానికి ఇరువైపులా ప్రత్యేక ఆకర్షణగా నాగ కాళీ, క్రిష్ణ కాళీ రూపాలను ఏర్పాటు చేయగా మరింత ఆహ్లదకరంగా మారింది. మహా గణపయ్య భక్తుల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, ప్రతి భక్తుడు మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఈ ఏడాది ప్రత్యేక తోలి పూజలో గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ఇక నేటి నుండి ఖైరతాబాద్ గణపతిని భక్తులు అనంత చతుర్దశి రోజైనా ఈ నెల 19వ తేదీ వరకు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. 19వ తేదీన ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని సామూహిక ఊరేగింపుగా వినాయక సాగర్ కు తరలించనున్నారు. ఆట పాటలతో దారిపొడవునా జై బోలో.. గణేష్ మహారాజ్ కి.. జై అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ పంచ ముఖ రుద్ర మహాగణపతిని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించనుంది.