Kasibugga temple Stampede: మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన భక్తులను పరామర్శించిన లోకేశ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- November 1, 2025 / 09:09 PM IST
Kasibugga temple Stampede: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారిని రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనితతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరామర్శించారు.
అనంతరం పలాస ఆసుపత్రికి వద్ద నారా లోకేశ్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు బీమా అందజేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు. (Kasibugga temple Stampede)
వెంకటేశ్వర స్వామి గుడి వద్ద జరిగిన ఘటన బాధాకరమణి నారా లోకేశ్ అన్నారు. తీవ్రంగా గాయాలపాలైన ముగ్గురిని శ్రీకాకుళం ఆసుపత్రికి పంపించామని తెలిపారు. గాయాలపాలైన వారు కోలుకునే వారకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
“ఈ గుడిని ఒక భక్తుడు ప్రజల కోసం కట్టించాడు. భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడానికి గుడి కట్టాడు. ఈ గుడిని గత నాలుగైదు సంవత్సరాలుగా కడుతున్నారు. ఆలయానికి ఇంతమంది భక్తులు వస్తారని లోకల్ అధికారులు కానీ, పోలీసులు గాని భావించలేదు.
ఈసారి ఎప్పుడూ లేనివిధంగా ఎక్కువమంది భక్తులు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేశారు. మూడు గంటల తర్వాత మళ్లీ గుడి తీయాలి కాబట్టి ఎంట్రీ మార్గం మూసేశారు. లోపల ఉన్న వాళ్లు బయటకు వచ్చే సమయంలో బయట ఉన్న వాళ్ళ లోపలకి వెళ్లాలనుకుని ఒకేసారి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది” అని అన్నారు.
