9 Months 6 Murders : జల్సాల కోసం.. 9 నెలల్లో 6 హత్యలు.. విజయవాడ పోలీసులకు చిక్కిన నరహంతక ముఠా
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.

9 Months 6 Murders
9 Months 6 Murders : వారంతా యువకులు. 21ఏళ్లలోపు వారే. దారి తప్పారు. వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. రెండు పదుల వయసులోనే తొమ్మిది నెలల్లో ఆరు హత్యలు చేశారు. అంతేకాదు మరో 12 మందిని మర్డర్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఇంతలో వారి పాపం పండి పోలీసులకు చిక్కారు. జల్సాల కోసం ఆధారాలు లేకుండా హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న నరహంతక ముఠాకు విజయవాడ పోలీసులు బేడీలు వేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఐదుగురు ఉన్నారు. 21ఏళ్లకే వారంతా నేర ప్రవృత్తి అలవర్చుకోవడం ఆందోళన కలిగించే విషయం.
విజయవాడ శివారు పోరంకిలోని ఓ బ్యాంకు ఏటీఎంలో ఈ నెల 12న చోరీ యత్నం జరిగింది. దర్యాప్తులో భాగంగా పెనమలూరు పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించగా ముఖానికి ప్లాస్టిక్ కవర్లు వేసుకున్న వ్యక్తులు కనిపించారు. అనుమానంతో తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ యత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన వారినీ పట్టుకున్నారు. తొలుత వారంతా తాము చేసిన హత్యలపై మౌనంగా ఉన్నారు. అయితే పోలీసులు వారి వేలిముద్రలను విశ్లేషించగా… కృష్ణా జిల్లా కంచికచర్లలో గతేడాది డిసెంబర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. తొలుత బుకాయించినా… చివరికి హత్యల వివరాలు వెల్లడించారు.
వృద్ధులు, ఒంటరి వ్యక్తులే లక్ష్యం
పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్, గోపీ రాజు, చక్రవర్తి అలియాస్ చక్రి, నాగదుర్గారావు అలియాస్ చంటి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఫణీంద్ర కుమార్ పెయింటింగ్ చేస్తుంటాడు. వ్యసనాలకు బానిసలైన వీరు ముఠాగా ఏర్పడ్డారు. పగటి పూట ఆటోలు నడిపేవారు. కూరగాయలు అమ్మేవారు. పనిలో పనిగా కాలనీలకు దూరంగా ఉన్న, ఒంటరి వృద్ధుల ఇళ్లను గుర్తించేవారు. రెక్కీ నిర్వహించాక హత్యలకు పాల్పడేవారు.
* మొదట… 2020 అక్టోబరులో పోరంకి విష్ణుపురం కాలనీలో ఒంటరిగా ఉంటున్న నళిని(58) అనే మహిళను హత్య చేశారు. తమ వివరాలు బటయకు రాకపోవడంతో మరిన్ని ఘటనలకు తెగించారు.
* రెండోసారి… 2020, నవంబరులో పోరంకిలోని తూముల సెంటర్లో ఉండే సీతామహాలక్ష్మి(63)ని చంపారు.
* మూడోసారి… అదే ఏడాది డిసెంబరులో కంచికచర్లలోని నాగేశ్వరరావు(80), ప్రమీలారాణి(75) దంపతుల ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి వారిని చంపి బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
* ఈ ఏడాది జనవరిలో తాడిగడపలో కట్టపై ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మి (58)ని, తర్వాత.. ఈనెలలో పోరంకిలోని పాత పోస్టాఫీసు సమీపంలో ఉంటున్న పాపమ్మ(85)ను చంపి, నగలతో ఉడాయించారు.
* నిందితులు తాము హత్య చేసిన ఇంటిపై నిఘా పెట్టేవారు. పోలీసులు వచ్చారా? బాధితులు, చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో తెలుసుకునే వారు. మృతదేహాలను శ్మశానానికి పంపే వరకు అక్కడే ఉంటారు. అవసరమైతే అంత్యక్రియల్లోనూ సాయం చేసేవారు.
12మంది ప్రాణాలు దక్కాయి
ఇవి మాత్రమే కాకుండా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరిలో మరికొందరిని చంపాలని ఈ ముఠా సభ్యులు స్కెచ్ వేశారు. ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించారు. ఇంతలో పోలీసులకు దొరికిపోవడంతో 12మంది ప్రాణాలు దక్కాయి.
పోలీసులు చెప్పే వరకు హత్యలని తెలియదు:
వీరిపై గతంలో కేసులు లేకపోవడంతో కంచికచర్ల జంట హత్యల కేసులో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ ఏడాది మార్చిలో తాడిగడపలో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. దీనిపై పెనమలూరు స్టేషనులో కేసు నమోదైనా ఆధారాలు దొరకలేదు. మిగిలిన హత్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందలేదు. హత్య జరిగినట్లు తెలియకుండా ఊపిరి ఆడకుండా చేసి, చంపేయడంతో అందరూ సహజ మరణాలుగా భావించి, అంత్యక్రియలు చేశారు. పోలీసులు మృతుల బంధువులకు స్వయంగా వెళ్లి చెప్పే వరకు హత్యలనే విషయం వారికి తెలియదు. హత్యలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల 40 తులాల నగలను దొంగిలించారు. వీటిని వేర్వేరు చోట్ల తనఖా పెట్టి, విక్రయించి, సొమ్ము తెచ్చుకుని జల్సాలు చేసేవారు.