ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు జోరు వర్షాలు
వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
- T Venkateshwarlu
- Published On : September 23, 2025 / 12:06 PM IST
AP Rains Alert
Weather Updates: ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
ఈనెల 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడి 26వ తేదీకి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం దాటుతుందని అంచనా వేసింది.
Also Read: ఈ హోండా సెడాన్ కారు ఇప్పుడు రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే.. ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?
వీటి ప్రభావంతో రాగల నాలుగు రోజులు పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పిడుగుపాటు హెచ్చరిక చేశారు. 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. చెట్ల కింద నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్
విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు..
ఆరెంజ్ అలెర్ట్
శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు..
ఎల్లో అలెర్ట్
తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు..
