AP Budget 2024 : అసెంబ్లీలో గందరగోళం.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. కేబినెట్ భేటీలో కొన్నికీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
- Harishth Thanniru
- Published On : February 7, 2024 / 10:36 AM IST
AP Assembly Budget Session 2024
AP Assembly Budget Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభమైన సమయం నుంచి టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అయితే, టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి బిల్లులు ప్రవేశపెట్టారు.
Also Read : AP Budget 2024 : బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. వెల్లడించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
స్పీకర్ తమ్మినేని సీతారాం పలుసార్లు టీడీపీ సభ్యులకు సభలో సభా మర్యాదలు పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్ వేశారు. దీంతో 10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు స్పీకర్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, రామరాజు, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.
Also Read : Chandrababu Delhi Tour : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పొత్తులపై రానున్న క్లారిటీ!
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8.30గంటల సమయంలో సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- 2024-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి మండలి ఆమోదించింది.
- నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం.
- డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల.
- నంద్యాల జిల్లా డోన్ లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం.
- ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల.
- ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుమతి.
- అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ.
- తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ.
- కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం.
- ఏపీ శాసనసభలో ఈనెల 5న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
