×
Ad

CM Jagan Delhi : ఢిల్లీకి సీఎం జగన్.. అమిత్ షా తో కీలక భేటీ

ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 10,2021) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. రాష్ట్రానికి

  • Published On : June 9, 2021 / 01:37 PM IST

Cm Jagan Delhi

CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 10,2021) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు. బెయిల్ పిటిషన్ రద్దు, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

నిజానికి రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకపోవడంతో ఆ పర్యటన రద్దు అయింది. తాజాగా జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీఎం జగన్ ఢిల్లీ టూర్ సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జగన్ కలవనుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వ్యాక్సినేషన్ విషయంలో అంతా ఒక మాటపై ఉండాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇటీవల జగన్ లేఖలు రాశారు. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్రంగా చర్చ జరగుతోంది. మరోవైపు ఎంపీ రఘురామ రాజు ఢిల్లీలోనే ఉంటూ.. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే ఎన్ హెచ్ ఆర్ సీ సైతం ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిస్తున్నాయి. అందులోనే నేరుగా అమిత్ షాను కలుస్తుండడంతో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత చేకూరింది.

పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు.. దానికి తోడు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విభజన హామీలు, వ్యాక్సినేషన్‌పై కూడా సీఎం జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దుపై కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ సర్కార్‌ రాజద్రోహం కేసు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులు చేశారు. దీంతో సీబీఐ, ఈడీ కేసులు, బెయిల్ రద్దుపై విచారణ నేపథ్యంలో వ్యాక్సిన్ల అంశంపై కేంద్రంతో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.