×
Ad

YS Jagan Mohan Reddy : అమరావతిలో 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్

YS Jagan Mohan Reddy : పేదల తలరాతలు మార్చాలని అనుకున్నాం. వాళ్ల జీవితాలు మారే విధంగా వాళ్లకి అండగా నిలబడాలని చెప్పి అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి..

  • Published On : May 22, 2023 / 08:02 PM IST

YS Jagan Mohan Reddy (Photo : Twitter)

CM Jagan – Housing Sites : ఈ నెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు సీఎం జగన్. పేదల తలరాత మారుస్తామని సీఎం జగన్ అన్నారు. పేదలు ఇళ్ల స్థలాలు పొందకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇళ్ల స్థలాలను శ్మశానంతో పోల్చారని బందరు సభలో మండిపడ్డారు సీఎం జగన్.

”పేదల తలరాతలు మార్చాలని అనుకున్నాం. వాళ్ల జీవితాలు మారే విధంగా వాళ్లకి అండగా నిలబడాలని చెప్పి అక్కడే అదే అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26న మీ బిడ్డ అక్కడికే వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టనున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు. మీ బిడ్డ పేదలకు 1.1 సెంటు స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టిస్తా ఉంటే.. దాన్ని శ్మశానంతో పోలుస్తాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు” అని ఫైర్ అయ్యారు సీఎం జగన్.

”రాజధాని పేరుతో గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలని చంద్రబాబుతో పాటు గజ దొంగల ముఠా ప్లాన్ చేసింది. దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు.. అమరావతి ప్రాంతంలో 50వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం. ఈ నెల 26న వాటిని పంపిణీ చేస్తాం” అని సీఎం జగన్ ప్రకటించారు.

Also Read..Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు

”పేదలు కేవలం పాచి పనులు చేయాలి. కార్మికులుగానే ఉండాలి. వాళ్లు అక్కడ ఉండకూడదు. పొద్దునే రావాలి, పనులు చేసుకుని తిరిగి వెళ్లిపాలి. ఇదీ.. చంద్రబాబు కోరుకున్న అమరావతి. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఇంతకన్నా సామాజిక అన్యాయం మరెక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం” అని ధ్వజమెత్తారు సీఎం జగన్.

”చంద్రబాబు హయాంలో ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తుంటే కోర్టులో కేసులో వేయించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకెళ్లారు. పెత్తందారీ భావజాలానికి చంద్రబాబు ప్రతీక. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోల్చారు” అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్.