అమరావతిలో మళ్లీ భూసమీకరణ.. రాజధాని కోసం మరో 30వేల ఎకరాలు..
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
- Harishth Thanniru
- Published On : April 13, 2025 / 12:52 PM IST
Amaravathi Rajadhani
Amaravathi Rajadhani: ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజధాని ప్రాంతంలో పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు రాజధాని ప్రాంతం విస్తరణకు కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక రాజధాని విస్తరణ పనులపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనుంది.
Also Read: Nara Lokesh: మంగళగిరి ప్రజలకు మంత్రి లోకేశ్ కీలక విజ్ఞప్తి.. వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
రాజధాని విస్తరణకోసం మరింత భూమిని సమీకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ కి అనుసంధానంగా భూముల సమీకరణకు యోచన చేస్తోంది. భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రభుత్వం.. సుమారు మరో 30వేల ఎకరాల మేర భూ సమీకరణ అవసరమవుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాజధాని గ్రామాలు కాకుండా, మరో 20 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని భావిస్తున్నప్పటికీ.. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ టెక్నో ఫిజిబిలిటీ నివేదికను సిద్ధం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను త్వరితగతినరూపొందించి కేంద్రానికి పంపనుంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది.
