AP Capital Amaravati : ఏపీ రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. మూడు రాజధానుల నిర్మాణం చేస్తామని ప్రకటించి..ఆ దిశగా అడుగులు వేసింది. అయితే..జగన్ తీసుకున్న నిర్ణయంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సీఎం జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు..మళ్లీ సమగ్రమైన బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
Read More : Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం
అంతకుముందు..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి…మాట్లాడారు. వికేంద్రీకరణ విషయంలో..అన్ని ప్రాంతాల ప్రజల ఆందోళనలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి భాగస్వాములు అయిన..అందరి వాదనలు సరిగ్గా వినలేదని సభకు తెలిపారు. శాసనమండలిలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు..సెలక్ట్ కమిటీ పంపాలనే ప్రతిపాదన తెచ్చారన్నారు. అందుకే పాత బిల్లులను రద్దు చేయడం జరుగుతోందన్నారు. ఈ మేరకు గతంలో రద్దు చేసిన అమరావతి – సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఎంఆర్డీఏ (AMRDA)కు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏ (CRDA) కు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించారు.
భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోడానికి కారణాలుగా తెలిపారు. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అభివద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసిందని వివరించారు.