Minister Rambabu : పల్నాడు జిల్లాలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. మూడేళ్ల నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి మహిళలపై కోప్పడ్డారు.
అయితే మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు నిలదీయడంతో అంబటి రాంబాబు వారి మీద కోప్పడినట్లు తెలుస్తోంది.
Andhra pradesh : వైసీపీ ప్రభుత్వానికి గడప గడపకూ ఛీత్కారాలే : మాజీ మంత్రి
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు… సోమవారం గడపగడపకులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తమ ప్రాంతంలో రోడ్లు ఎందుకు వేయలేదని మంత్రిని నిలదీశాడు. అంతకుముందు కూడా పలువురు మంత్రి అంబటిని నిలదీశారు. దివ్యాంగురాలిని అయిన తాను మూడేళ్లుగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా… తనకు ఫలితం దక్కలేదని ఓ మహిళ మంత్రికి తెలిపారు. అక్కడే ఉన్న అధికారులను ఆరా తీయగా.. 4 విద్యుత్ మీటర్లు ఉన్న కారణంగా ఆమెకు పింఛన్ రాలేదని వివరించారు.
ఇదిలా ఉంటే ఆదివారం ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గంలోని ప్రజల చెంతకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మహిళ నుంచి ఊహించని నిరసన ఎదురైంది. ఒక్కో కుటుంబం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని మంత్రి బుగ్గన ఆమెకు వివరించే ప్రయత్నం చేశారు. ఆమె వెంటనే సామాన్య ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మునే కదా తిరిగి ఇస్తున్నారు అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసింది.
Andhrapradesh : మూడేళ్లలో ఏం చేయలేనిది రెండేళ్లలో ఏం చేస్తారు? అంటూ వైసీపీ ఎమ్మెల్యేపై మహిళలు ఫైర్
ఆమె ఎదురు ప్రశ్నతో షాక్ కు గురైన మంత్రి వెంటనే తేరుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా.. ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. వంట నూనె నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరిగాయి కదా అంటూ ప్రశ్నించింది. దానికి మంత్రి సమాధానం ఇస్తూ.. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెరిగిందని.. హైదరాబాద్ లోనూ అదే రేట్లు ఉన్నాయని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ప్రశ్నిస్తుండడంతో అసలు మీకు వినే ఉద్దేశం లేదమ్మా అంటూ మంత్రి కాస్త విసుక్కున్నారు.
అటు అనంతపురం జిల్లాలో మాజీమంత్రి శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రజలు ఆయనను నిలదీశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారు. గడప గడపకు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలకు అసంతృప్తి, నిరసనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను జనం నిలదీసిన సందర్భాలున్నాయి. పథకాలపై ప్రజాప్రతినిథులు వివరిస్తుంటే.. ధరలు, పన్నులు, అభివృద్ధి పనులు, రోడ్లపై జనం ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది.