Chandrababu On Atmakur ByElection : నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైసీపీ, బీజేపీ బరిలోకి దిగాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇది ఇలా ఉంటే.. ఉప ఎన్నికలో టీడీపీ వైఖరిపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేదని ఆయన ప్రకటించారు.
పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని చంద్రబాబు చెప్పారు. దీనికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ సంప్రదాయాన్ని గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయరాదని నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు.(Chandrababu On Atmakur ByElection)
Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా
ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ”కడప జిల్లా బద్వేల్లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదో.. అదే కారణంతోనే ఆత్మకూరులోనూ పోటీ చేయడం లేదు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయి. చనిపోయిన నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయదని” చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మకూరు ఉపఎన్నికపై వైసీపీ సంస్కారం లేకుండా మాట్లాడిందని చంద్రబాబు మండిపడ్డారు. మరణించిన వారి కుటుంబసభ్యులకే ఉప ఎన్నికలో టికెట్ ఇస్తే పోటీ పెట్టకూడదన్నదే టీడీపీ విధానం అని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదన్నారు. ఏఈపై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి దారుణం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల దాడుల పరిపాటిగా మారాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజా ప్రతినిధుల దాడులపై సీఎం జగన్ మౌనం దేనికి సంకేతం అని చంద్రబాబు నిలదీశారు.
CM Candidate Pawan Kalyan : సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..? టీడీపీకి చెక్ పెట్టేలా బీజేపీ స్కెచ్..?
వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెంట రాగా.. విక్రమ్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు గెలుపునిస్తాయని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఆయన అడుగు జాడల్లోనే విక్రమ్ రెడ్డి నడుస్తున్నారని కాకాణి తెలిపారు.