auto drivers sevalo
Auto Driver Service : ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డైవర్లకు ప్రతీయేటా రూ.15వేలు ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని ప్రారంభించారు. విజయవాడలోని బసవపున్నయ్య స్టేడియంలో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో కలిసి చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర ఖాతాల్లో జమ చేశారు. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి చేకూరనుంది. అంతకుముందు ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్ నగర్కు చంద్రబాబు, పవన్, మాధవ్, లోకేశ్ తదితరులు ఆటోలో సభా ప్రాంగణానికి వచ్చారు. ఆటో వాలాల ఖాకీ చొక్కాలను ధరించి సభలో పాల్గొన్నారు.
ఏ జిల్లాల్లో ఎక్కువ మంది…
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా మొత్తం 3.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తరువాత 2,90,669 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేశారు. విశాఖపట్టణంలో అత్యధికంగా 22,955 మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారు. ఆ తరువాత శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 17,405 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 16,405 మంది, విజయనగరం జిల్లాలో 15,479 మంది, శ్రీకాకుళం జిల్లాలో 13,887 మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతితక్కువగా 4,217 మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారు.
ఏ కులంలో ఎంతమంది..
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీయేటా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద మొత్తం 2,90,669 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో అత్యధికంగా బీసీలు 1,61,737 మంది ఉన్నారు. ఎస్సీలు 70,941 మంది, ఎస్టీలు 13,478 మంది, కాపులు 25,801 మంది, రెడ్లు 7,013 మంది, ఈబీసీలు 4,186 మంది, మైనార్టీలు 3,867 మంది, కమ్మ 2,647 మంది, క్షత్రియ 513 మంది, బ్రాహ్మణులు 365 మంది, ఆర్యవైశ్యులు 121 మంది ఉన్నారు. అర్హులైన వారందరికీ ఖాతాల్లో రూ.15వేలు జమ కానున్నాయి.
♦ ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి ముందు మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
♦ మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి NBM అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో Application Status పై క్లిక్ చేయాలి.
♦ ఆ తరువాత స్కీం (Auto criver sevalo) ను సెలెక్ట్ చేసుకోవాలి. సంవత్సరం 2025-2026 అని సెలెక్ట్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. ఆ తరువాత క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసి ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీని ఎంట్ చేయాలి.
♦ ఆ తరువాత సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ వివరాలు వస్తాయి.
♦ స్టేటస్ లో మీరు పేరు ఉండి డబ్బులు రాకుంటే.. అవసరమైన డాక్యుమెంట్లతో గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలి.
♦ ఒకవేళ స్టేటస్ లో మీపేరు లేకుంటే.. మళ్లీ దరఖాస్తు పథకంకు సంబంధిత పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.