Kakinada UCO Bank : ఏం తెలివి? నకిలీ బంగారంతో రూ.2కోట్లు రుణం.. కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ ఘరానా మోసం
కాకినాడ యూకో బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్.. 8 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలు తనఖా పెట్టి 2కోట్ల 50లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. 15 నెలలుగా 60 దఫాల్లో 30మంది పేర్లపై లోన్లు పొందాడు.
Kakinada UCO Bank : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా ఉంది ఓ బ్యాంకు ఉద్యోగి వ్యవహారం. తన దాకా వచ్చే బంగారు నగలకు విలువ కట్టే గోల్డ్ అప్రైజర్.. తాను పని చేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు. నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టి మోసం చేశాడు.
కాకినాడ యూకో బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్.. 8 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలు తనఖా పెట్టి 2కోట్ల 50లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. 15 నెలలుగా 60 దఫాల్లో 30మంది పేర్లపై లోన్లు పొందాడు.
గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకి వచ్చే కస్టమర్లు తెచ్చిన బంగారం అసలైనదా? నకిలీదా? తక్కువ క్యారెట్లు ఉన్నదా? అని తేల్చి అధికారులకు నివేదిక ఇవ్వడం శ్రీనివాస్ పని. చాలా కాలం నమ్మకంగా పని చేశాడు. శ్రీనివాస్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అధికారులు లోన్లు మంజూరు చేసేవారు.
ఈ క్రమంలోనే శ్రీనివాస్ బుద్ది మారింది. చేతివాటం ప్రదర్శించాడు. నకిలీ బంగారంతో బ్యాంకుని మోసం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. తనకు తెలిసిన వారితో కలిసి ప్లాన్ చేశాడు. 30మందితో నకిలీ బంగారం తెప్పించి దాన్ని ఒరిజినల్ గా నిర్ధారించాడు. ఆ విధంగా 30 మంది పేర్లతో 60సార్లు 8 కిలోలకు పైగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి రెండున్నర కోట్ల లోన్ తీసుకున్నాడు.
అది నకిలీ బంగారం అని అధికారులు లేటుగా గుర్తించారు. శ్రీనివాస్ మోసం బయటపడటంతో బ్యాంకు మేనేజర్ పోలీస్ కేసు పెట్టారు. కేసు దర్యాఫ్తు చేసిన పోలీసులు శ్రీనివాస్ తో పాటు అతడికి సహకరించిన రాంబాబు, కొండరాజును అరెస్ట్ చేశారు. ఈ భారీ స్కామ్ శ్రీనివాస్ ఒక్కడే చేశాడా? లేక దీని వెనుక బ్యాంకు అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.