Botsa On AP Cabinet : సీఎం జగన్ ఆధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుస్తానని వైసీపీ మొదటి శాసనసభా పక్ష సమావేశంలోనే సీఎం జగన్ చెప్పారని ఆయన తెలిపారు. ఈరోజు కూడా అదే విషయం చెప్పారని, తామంతా మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని వెల్లడించారు. సీఎం జగన్ తమకు ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని నిర్వహిస్తామన్నారు.
ఇప్పుడు మా టార్గెట్ అంతా 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే అని బొత్స సత్యనారాయణ చెప్పారు. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి అనేది పూర్తిగా సీఎం నిర్ణయం మీదే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనే విషయంలో సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. సీనియర్లు ఉంటారా? లేదా? అనేది సీఎం ఇష్టం అని చెప్పారు.(Botsa On AP Cabinet)
Kodali Nani: రాజీనామా తర్వాత కొడాలి నాని రియాక్షన్
దేవుడు, సీఎం అనుకుంటే కేబినెట్ లో కొనసాగుతా అని బొత్స అన్నారు. పాత కేబినెట్ లో ఉన్న అన్ని సమీకరణాలు కొత్త కేబినెట్ లోనూ ఉంటాయని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హింట్ ఇచ్చారు. జిల్లాల వారిగా మంత్రివర్గం కూర్పు ఉంటుందా? లేదా? అనేది సీఎం ఇష్టం అన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు మంత్రిగా తాను పని చేశానని, అన్నింటికంటే ఇది ఛాలెంజింగ్ పీరియడ్ అని బొత్స సత్యనారాయణ అన్నారు.
”వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుస్తారని సీఎం జగన్ ముందే చెప్పారు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తాం. మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలనే విషయాన్ని సీఎం నిర్ణయిస్తారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తామని సీఎంకు చెప్పాము” అని బొత్స వివరించారు.
సీఎం జగన్ ఆధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. మరోవైపు ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఎదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించారు.(Botsa On AP Cabinet)
AP Ministers Resignations : సీఎం జగన్ కు రాజీనామా పత్రాలు సమర్పించిన మంత్రులు
మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని, తాను కూడా అందరి మాదిరిగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొందరికి స్థానం ఉంటుందని చెప్పారు.
కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందించిన నాని… కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని అన్నారు. కొత్త కేబినెట్లో తనకు స్థానంపై అవకాశాలు తక్కువేనని చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశామని తెలిపారు.
ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారన్నారు. మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే.. జగన్ ఎక్కువగా బాధపడినట్టుగా కనిపించిందన్నారు.