YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
- Naresh Mannam
- Published On : May 20, 2022 / 07:06 AM IST
YS Viveka Murder
YS Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తాము ఇప్పుడే చెప్పలేమని సీఎం హైకోర్టుకు తెలిపింది. ఈ హత్య కేసులో ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ లేబొరేటరీల నుంచి నివేదికలు రావాల్సి ఉందన్న సీబీఐ.. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును ఎప్పటికి పూర్తి చేస్తామన్న దానిపై నిర్ధిష్ట సమయం చెప్పలేమని హైకోర్టుకు స్పష్టం చేసింది.
YS Viveka Murder Case: వివేకా హత్య నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ ఎల్లుండికి వాయిదా
సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు ఈ మేరకు కోర్టుకు నివేదించారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టులో దాఖలు చేశామని, నిందితుల అనుచరులు కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి వాహన డ్రైవర్ను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. విచారణలో స్థానిక అధికారుల నుంచి సహకారం అందడం లేదన్న సీబీఐ లాయర్.. పిటిషనర్లకు బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఐజీ స్థాయి అధికారి
నిందితులు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల విచారణను జూన్ 13కి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి.. అప్పటిలోగా ఫోరెన్సిక్ నివేదికలను తెప్పించుకునేందుకు యత్నించాలని.. సాధ్యపడకపోతే కేసు మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతామని చెప్పారు. ఈ హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి (ఏ5), వై.సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమాశంకర్రెడ్డి (ఏ3) బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
