YS Viveka Murder Case: వివేకా హత్య నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ ఎల్లుండికి వాయిదా
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు.
YS Viveka Murder Case: వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐతోపాటు, సునీత తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు. ఏ2గా ఉన్న వై.సునీల్ యాదవ్, ఏ3గా ఉన్న ఉమా శంకర్ రెడ్డి, ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం ఈ విచారణ కొనసాగుతోంది. నిందితుల నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించారని, వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు
అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని ఏ5గా ఉన్న శివ శంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. అయితే, ఈ అంశంలో తమ వాదనలు కూడా వినాలని ఇంప్లీడ్ దాఖలు చేశామని సునీత తరఫు న్యాయవాదులు తెలిపారు. మృతుడి కుమార్తె కాబట్టి, సునీతకు కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో శివశంకర్ రెడ్డి పిటిషన్ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుతం వ్యాజ్యం కూడా ఆ కోర్టు విచారణకే వెళ్లాలని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శివ శంకర్ రెడ్డి తరఫు వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు ఎల్లుండి వింటామని చెప్పింది.