Chandrababu Naidu: వారిని కంట్రోల్ చేస్తున్నా.. పదే పదే హెచ్చరిస్తున్నా: చంద్రబాబు
జగన్ సీఎంగా ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీవైపు చూసేవారా అని అడిగారు.
- T Venkateshwarlu
- Published On : January 1, 2025 / 03:23 PM IST
Chandrababu Naidu
ఎమ్మెల్యేలకు దశల వారీగా కౌన్సెలింగ్ ఇస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతను ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూ, వారు ప్రజలకు జవాబుదారీలా ఉండేలా కంట్రోల్ చేస్తున్నానని తెలిపారు.
ఎవరూ తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎవ్వరూ తప్పుడు పోస్టులు పెట్టకుండా చాలావరకూ నియంత్రించగలిగామని అన్నారు. ఇంకా సమీక్షించుకుని ప్రజలకు ఏది మేలో అదే చేస్తామని చెప్పారు. కొన్ని అంశాల్లో శ్రేణుల అభిప్రాయాలు, తన అభిప్రాయాలకు తేడా ఉంటోందని తెలిపారు.
సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. 1995లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం, మతకలహాలను అణచివేసినట్లే ఇప్పుడూ పనిచేస్తానని అన్నారు. కొందరు కార్యకర్తలు తమ సొంత అజెండా నేను అమలు చేయాలనుకుంటున్నారని తెలిపారు. జగన్ లాగా తాము తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని చెప్పారు.
తనకు నా ప్రజలే హై కమాండ్ అని అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. అమరావతి, పోలవరంతో పాటు అనేక వ్యవస్థలను జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గత 6నెలలుగా శ్రమిస్తున్నామన్నారు. పలుమార్లు డిల్లీ పర్యటన ద్వారా కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకోగలుగుతున్నామని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6నెలల్లో 4లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. జగన్ సీఎంగా ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీవైపు చూసేవారా అని అడిగారు. జగన్ నవరత్నాలు అంటూ ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, రూ.3వేల ఫించన్ అమలు చేశారా అని నిలదీశారు. జగన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని, తాము మేం ఒకటో తేదీనే ఇస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూనే జగన్ విధ్వాంసాన్ని సరిచేస్తూ, ఆర్థిక కష్టాలు అధిగమిస్తున్నామని తెలిపారు.
Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో రెచ్చిపోయిన మందుబాబులు.. ఎన్నికోట్ల మద్యం తాగారో తెలుసా?
