Cm Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక చర్యలు.. సీఎంతో హైపవర్ కమిటీ భేటీ.. బాధితులకు రూ.15.43 కోట్ల పరిహారం
స్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన హైపవర్ పర్యవేక్షక కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Cm chandrababu naidu high power committee meeting sc st atrocities act compensation and protection
- ఎస్సీ, ఎస్టీ రక్షణపై సమీక్ష
- రూ.15 కోట్ల పరిహారం విడుదల
- నాలుగు అంచెల కార్యాచరణ అమలు
Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, భద్రతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అధ్యక్షతన అమరావతి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు తీరును అధికారులు సీఎంతో వివరిస్తూ, వారి రక్షణకు నాలుగు అంచెల కార్యాచరణను సమర్థంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక రక్షణ వ్యవస్థతో పాటు ప్రొటెక్షన్ సెల్స్, విజిలెన్స్ కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి కూలంకషంగా చర్చించారు.
బాధితులకు రూ.15.43 కోట్ల పరిహారం:
2026లో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన 810 కేసులను త్వరితగతిన పరిష్కరించినట్లు అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుల విచారణ కోసం రాష్ట్రంలో 14 స్పెషల్ సెషన్ కోర్టులతో పాటు మరొక ప్రత్యేక కోర్టు విధుల్లో ఉందని తెలిపారు. అంతేకాకుండా 2023 నుండి 2026 ఆగస్టు వరకు నమోదైన 1,478 కేసుల్లో బాధితులకు ఊరట కలిగిస్తూ రూ.15.43 కోట్ల పరిహారం తక్షణమే అందజేసినట్లు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హాజరు:
ఈ కీలక సమావేశంలో మంత్రులు డీబీవీ స్వామి, వి.అనిత, జి.సంధ్యారాణితో పాటు ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి భద్రత కల్పించడమే కాకుండా, వారి ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సమావేశంలో ప్రతిపాదించారు.
