Dwarampudi Chandrasekhar Reddy: పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇకపై పిఠాపురంలోనే ఉంటానని, ఇక్కడి నుంచి ఏపీ భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనను గెలిపిస్తే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీయిచ్చారు. కాకినాడ లోక్సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే.. రెండిటిలో దేనికి పోటీ చేస్తారని బీజేపీ కేంద్ర నేతలు తనను అడిగితే… అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పినట్టు పవన్ వెల్లడించారు. పవన్ తాజా వ్యాఖ్యలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పందించారు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్ వేశారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పవన్ కల్యాణ్కి ఏంటి ఈ కర్మ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఇదని వాపోయారు. తన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని పవన్ కల్యాణ్ పిఠాపురం వెళుతున్నాడు కానీ అక్కడి ప్రజలు ఆయనను ఓడిస్తారని జోస్యం చెప్పారు.
కాగా, పిఠాపురం నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్పై పోటీ చేయడానికి తానేమి భయపడడం లేదని, కచ్చితంగా గెలుస్తానని వంగా గీత దీమాగా చెబుతున్నారు.
Also Read: ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీపై మోహన్బాబు ఆసక్తికర వ్యాఖ్యలు