Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులపై నారా లోకేశ్ కీలక ప్రకటన..

విద్యార్థులందరికీ మంచి ఉద్యోగావకాశాలు కల్పించేలా చేస్తామని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సెమిస్టర్‌ వారీగా కాలేజీల అకౌంట్లో వేస్తామని చెప్పారు. గత వైసీపీ సర్కారు హయాంలో విడుదల చేయని రూ.4 వేల కోట్లను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా బాగుపడ్డాక దశ వారీగా ఇస్తామని తెలిపారు.

తాజాగా, తిరుపతిలోని శ్రీపద్మావతి విమెన్స్‌ వర్సిటీలో విద్యార్థినులతో సమావేశమైన నారా లోకేశ్ అనంతరం మాట్లాడారు. ఈ వర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా విద్యార్థినులు కృషి చేయాలన్నారు. ఏపీ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేలా విశ్వవిద్యాలయాల విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు.

Also Read: లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?

విద్యార్థులందరికీ మంచి ఉద్యోగావకాశాలు కల్పించేలా చేస్తామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోకి నూత పరిశ్రమలను తీసుకొచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చేసిన పోరాటం కంటే తాను ఇప్పుడు 3 రెట్లు ఎక్కువగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోరాడుతున్నానన్నారు.

అనంతరం టీడీపీ శ్రేణులతో లోకేశ్ మాట్లాడారు. టీడీపీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని మొదలుకుని బూత్‌ కమిటీ సభ్యుల వరకు అందరి పేర్లను కేఎస్‌ఎస్‌లో పేర్కొనేలా చేస్తున్నామన్నారు. టీడీపీలో పదవులు, సర్కారులో నామినేటెడ్‌ పోస్టుల కోసం కేఎస్‌ఎస్‌లో పేర్లు ఉండాలని తెలిపారు. టీడీపీ ఏదైనా ప్రోగ్రాంకి పిలిస్తే 120 మంది ఓటర్లతో ఉండే కేఎస్‌ఎస్‌ను కలవాలని తెలిపారు.