జగన్ తాజా రాజకీయ నిర్ణయాలపై ఉండవల్లి హాట్ కామెంట్స్.. జేడీ నూతన పార్టీ వల్ల ఎవరికి నష్టమో చెప్పేశారు!

జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీ ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ, ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు.

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలోకి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్ ఛార్జిలను మార్చుతున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. జగన్ తాజా రాజకీయ నిర్ణయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారు. సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి.. అటువంటి అనుభవం జగన్ మోహన్ రెడ్డికి ఉందని నేను అనుకోవడం లేదు. టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదు. టికెట్లు మార్చకపోతే అక్కడ కేసీఆర్ ఓడిపోయారు.. మార్చితే ఇక్కడ జగన్ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదని ఉండవల్లి అన్నారు.

ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదు.. అధికారం అంతా జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే గొప్ప ప్రయోగం చేశారు.. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమితమైన అభిమానం. అటువంటి నెహ్రూను విజయసాయి పార్లమెంట్లో తప్పుపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందుత్వం తగ్గుతుందని అనడం వాస్తవం కాదని ఉండవల్లి అన్నారు.

Also Read : ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీపై మాట్లాడుతూ.. జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నిజాయితీగల పార్టీని నడపడంరాక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేక. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం కచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, తెలంగాణ ఎన్నికల ప్రభావం కచ్చితంగా కనపడుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా భారీ వృక్షాలను నరికేస్తున్నారు.. వెంటనే దాన్ని ఆపాలి. మళ్లీ ఎటువంటి చెట్లు పెంచడం మన వల్ల కాదని అన్నారు.

Also Read : యశస్వీ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడు.. మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్

లోక్ సభలో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సరియైన పద్దతి కాదని ఉండవల్లి అన్నారు. పార్లమెంట్ లో ప్రవేశించిన దుండగుడికి ఆ పాసులు ఇచ్చిన ఎంపీని ఇప్పటిదాకా విచారించలేదు. ఇంత మందిని సస్పెండ్ చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని ఉండవల్లి అన్నారు.