Gossip Garage : అయ్యో.. పాపం మోసం పోయారట… బీసీలను తొక్కేయాలనే అరెస్టులు చేస్తున్నారట… రెడ్బుక్ రాజ్యాంగం వల్లే కేసులు నమోదు చేస్తున్నారట…. అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి కుటుంబ సభ్యులది ఏ తప్పులేదట… వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాటలు వింటుంటే.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లే ఉంది కదూ…. సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూములను దోచేసి… ఆధారాలతో సహా దొరికిపోతే… వేరొకరిపై నెపం నెట్టేయడం తప్ప ఇంకేమి చేస్తారంటున్నారు కూటమి నేతలు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగిపై చర్యలు ఉంటాయనే అంతా ఊహించినా…. అనూహ్యంగా ఆయన కుమారుడు ఇరుక్కోవడమే ఇక్కడి ట్విస్టు. ఇక జోగి వంతు కోసం వేచి చూస్తున్నారట టీడీపీ కార్యకర్తలు…
ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో జోగి రమేశ్..
కర్మ రిటర్న్స్…. వైసీపీ మాజీ మంత్రుల వ్యవహారంలో కర్మ ఫలం అనుభవిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు ఓవర్ చేయడం వల్లే చిక్కులు కొని తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఐతే కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు తప్పించుకుని తిరుగుతుండగా, మాజీ మంత్రి జోగి రమేశ్ వంటి వారు ఎటూ తప్పించుకోలేని పరిస్థితి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో జోగి రమేశ్ కుమారుడు అరెస్టు ద్వారా ప్రభుత్వం జోగి రమేశ్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండి వుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది..
సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయడం ఒక తప్పైతే.. ఆ తప్పు కప్పిపుచ్చుకోడానికి సవరణ పేరిట సర్వే నెంబర్ మార్చేయడం అంతకుమించిన తప్పుగా భావిస్తోంది ప్రభుత్వం. 2022లో జరిగిన ఈ కుంభకోణంలో జోగి కుమారుడు రాజీవ్తోపాటు ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు కీలక నిందితులు. ఇక వీరితోపాటు కుంభకోణానికి సహకరించిన ఉద్యోగులు కూడా జైలు పాలు కావాల్సి వచ్చింది. వాస్తవానికి 2022లో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండి వుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన జోగి రమేశ్ తన అధికార బలంతో ఫిర్యాదులపై విచారణ జరగకుండా చూసుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు.
ముఖ్యమైన డాక్యుమెంట్లు లభించడంతో జోగి రాజీవ్ అరెస్ట్..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంపై తీగ లాగడం… ముఖ్యమైన డాక్యుమెంట్లు లభించడంతో జోగి రాజీవ్ను అరెస్టు చేసింది. దీనిపై సహజంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా… జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. భూములు కొనుగోలు చేసి మోసపోయారని మేరుగ నాగార్జున వంటి వారు చేస్తున్న ప్రకటనలు ఎవరినీ నమ్మించేలా లేవంటున్నారు. ఒక చోట భూమి కొని… పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్తో భూములు విక్రయించడం మోసపోవడమెలా అవుతుందని ప్రశ్నిస్తోంది అధికార పక్షం. ఇక రెడ్బుక్ రాజ్యాంగం అంటూ మరో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలనూ కొట్టిపడేస్తున్నారు. 2022లో చోటుచేసుకున్న కుంభకోణానికి లోకేశ్ రెడ్బుక్కు సంబంధం ఏంటని.. అప్పట్లోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే…. ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది. విచిత్రంగా కుమారుడు అరెస్టు రోజే… జోగి రమేశ్ కూడా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిన పరిస్థితి. దీంతో జోగి రమేశ్ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటున్నారు. మొత్తానికి జోగి రమేశ్ కష్టాలన్నీ కొని తెచ్చికున్నట్లే కనిపిస్తున్నారు. సీఐడీ జప్తులో ఉన్న భూములపై లావాదేవీలు జరుగుతున్నప్పుడే వారించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.
Also Read : 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, మళ్లీ వైసీపీ ఘనవిజయం ఖాయం- వైఎస్ జగన్