Ttd Parakamani Case: కలియుగ దైవం ఖజానా చుట్టూ చర్చ. వడ్డీకాసుల వాడి కాసులు కాజేసిన వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. రెండు కీలక దర్యాప్తు సంస్థలు వేర్వేరుగా రెండు రిపోర్టులు సబ్మిట్ చేశాయి. ఎన్నికలకు ముందు నుంచి హాట్ టాపిక్గా ఉన్న ఈ కేసులో వాట్ నెక్స్ట్.? ఇప్పుడిదే చర్చ. పరకామణి పాపం ఎవరిదో తేల్చేశారా? సీఐడీ ఇచ్చిన నివేదికలో ఏముంది? నిందితుడి ఆస్తులపై ఏసీబీ ఏం తేల్చింది? కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోంది?
ఏడు కొండల వాడి హుండీ లెక్కింపులో చేతివాటం. అప్పుడెప్పుడో రెండు మూడేళ్ల కింద చిన్నగా రచ్చ అయి..ఆ తర్వాత పెద్ద ఇష్యూగా మారి..చివరకు సీఐడీ దర్యాప్తు జరిగే వరకు నడిచింది. ఏసీబీ కూడా ఎంటర్ అయింది. సీఐడీ దర్యాప్తుపై కూడా మధ్యలో స్తబ్ధత ఏర్పడితే కోర్టు ఆదేశాలతో విచారణ మళ్లీ స్పీడందుకుంది. ఆ తర్వాతే కీలక మలుపులు తిరుగుతూ వస్తోంది పరకామణి చోరీ కేసు.
వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు విచారణ సాగింది. ఎట్టకేలకు సీఐడీ తన దర్యాప్తు రిపోర్ట్ను ఏపీ హైకోర్టుకు అందజేసింది. మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. రెండు కీలక దర్యాప్తు సంస్థల రిపోర్ట్లను పరిశీలించాక హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ఆ రోజు కోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్డారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు అప్పట్లో పరకామణి విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను అధికారులు ప్రశ్నించారు. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ చిక్కినట్లు చెప్తున్నారు. అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14 కోట్ల 43 లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్గా రాయించారు. 2023 జూన్ 19న తీర్మానం చేసి ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదిర్చారు. చోరీ కేసును ప్రైవేటులో రాజీ చేయడమేంటంటూ అప్పటి నుంచి రచ్చ నడుస్తోంది. పరకామణి కేసు రాజీ వెనుకున్న మతలబేంటన్నదానిపై దర్యాప్తు జరిపిన సీఐడీ కోర్టుకు నివేదిక ఇచ్చింది.
సీఐడీ కోర్టుకు ఇచ్చిన రిపోర్ట్లో ఏముందనేదే సస్పెన్స్గా మారింది. నిందితుడు రవికుమార్ తరఫు న్యాయవాది దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల కాపీలు ఇవ్వాలని అభ్యర్థించినా కోర్టు తోసిపుచ్చింది. అయితే పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న అధికారి సతీష్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారినట్లు ఆ మధ్య చర్చ జరిగింది. సతీష్ మరణం తర్వాత దర్యాప్తు డైలమాలో పడిందా.? ఆల్రెడీ సతీష్ చెప్పాల్సిన విషయాలన్ని సీఐడీకి చెప్పేశారా.? అసలు సతీష్ మరణంపై దర్యాప్తు నివేదికలో సీఐడీ ఏమని పేర్కొందనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది.
సీఐడీ, ఏసీబీ రిపోర్ట్లను స్టడీ చేసిన తర్వాత కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అటు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తులో ఏం తేల్చిందనేది కూడా పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది. పరకామణి చోరీ కేసును రాజీ కుదిర్చి..నిందితుడు రవికుమార్ ఆస్తులను కొందరు వైసీపీ నేతలు తమ పేరుపై రాయించుకున్నారన్న అలిగేషన్స్ ఉన్నాయి. నిజంగా అలా జరిగిందా.? జరిగితే రవికుమార్ నుంచి ఆస్తుల బదిలీ ఎలా జరిగింది.? అసలు రవికుమార్కు అన్ని ఆస్తులు ఎక్కడివి.? పరకామణి లెక్కింపులో చోరీ చేసే రవికుమార్ కోట్లకు పడగెత్తాడా.? ఈ కన్ఫ్యూజన్స్కు ఏసీబీ క్లారిటీ ఇచ్చినట్లేనా.? కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏయే అంశాలను మెన్షన్ చేసిందనేది చర్చనీయాంశంగా మారింది. అటు సీఐడీ, ఇటు ఏసీబీ రిపోర్టులను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీసుకునే నిర్ణయంపైనే పరకామణి కేసులో వాట్నెక్స్ట్ అనేది క్లారిటీ రానుంది.
Also Read: పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్లోకి తెస్తుందా?