Temples Development: ఆరు ఆలయాల అభివృద్ధికి నిధులు.. శ్రీవాణి ట్రస్ట్ కు సర్కార్ అనుమతి
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల పునర్నిర్మాణానికి(Temples Development) శ్రీవాణి ట్రస్ట్ నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Government granted permission to utilize Srivani Trust funds for development of 6 temples in ap and tg
- ఆరు ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు.
- శ్రీవాణి ట్రస్ట్కు సర్కార్ అనుమతి.
- దేవాలయాల రూపురేఖలు మారనున్నాయి.
Temples Development: తెలుగు రాష్ట్రాల్లోని పలు పురాతన, ప్రముఖ దేవాలయాల పునర్నిర్మాణానికి, అభివృద్ధి(Temples Development) పనులకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. ట్రస్ట్ చేసిన తీర్మానాల ఆధారంగా మొత్తం ఆరు దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులు, ఆలయాల జీర్ణోద్ధరణ పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
ఈ నిధుల కేటాయింపులో భాగంగా సికింద్రాబాద్ (శ్రీగిరి) లోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు కేటాయించారు. అలాగే ధర్మవరం (సిద్ధయ్యగుట్ట) పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ. 50.85 లక్షల నిధులను మంజూరు చేశారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా దొమ్మాట గ్రామంలోని శ్రీమహాకాళేశ్వర ఆలయ రూపురేఖలను మార్చేందుకు, పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఏకంగా రూ. 4.60 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం పూర్తి అంగీకారం తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా మునగపాకలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ. 1.75 కోట్లను ప్రభుత్వం అనుమతించింది. వీటితో పాటు సంగారెడ్డి జిల్లా కించన్పల్లిలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పనులకు రూ. 1.09 కోట్లు, కర్నూలు జిల్లా హుస్సేనాపురం గ్రామంలోని శ్రీసుంకులమ్మ, మారెమ్మ దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 1.10 కోట్ల నిధులను సర్కార్ మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా ఆలయాల్లో త్వరలోనే ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయి.
