Harirama Jogaiah Survey: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన హరిరామ జోగయ్య
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
- Harishth Thanniru
- Published On : February 21, 2023 / 12:34 PM IST
Harirama Jogaiah
Harirama Jogaiah Survey: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథనరంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది. పలు సంస్థలు పార్టీల వారిగా సర్వేలు నిర్వహిస్తూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. అయితే, ఆయన సర్వేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్ర తరువాత ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో చెప్పారు.
హరిరామ జోగయ్య సర్వే ప్రకారం.. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బస్సు యాత్రకు ముందు, తర్వాత ఫలితాలపై లేఖ విడుదల చేశారు. పవన్ బస్సు యాత్రకు ముందు జనసేన 15, టీడీపీ 65, వైసీపీ 95 స్థానాల్లో విజయావకాశాలు ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలు పెట్టిన తర్వాత జనసేన 40, టీడీపీ 55, వైసీపీ 80 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని హరిరామ జోగయ్య చెప్పారు. పవన్ బస్సుయాత్రతో వైసీపీ, టీడీపీ గెలుపు ఫలితాలు తగ్గి, జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని హరిరామ జోగయ్య అన్నారు.
హరిరామ జోగయ్య సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జనసేనాని కింగ్ మేకర్ అవుతుందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. జనసేన అధినేత త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుందని, ఏపీలో జనసేన ప్రాబల్యం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో హరిరామ జోగయ్య తాజా సర్వేసైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.
