Bandaru Satyanarayana
Bandaru Satyanarayana – Anakapalle : అనకాపల్లిలో టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బంగారు సత్యనారాయణ సత్యమేవజయతే దీక్ష చేస్తున్నారు. అయితే, ఇటీవల మంత్రి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి రోజాను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారని, దీనిపై పోలీసులు ఆయనకు 41ఎ కింద నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రాగా, టీడీపీ నేత బండారు ఇంట్లోనే ఉండిపోయారు. తన గదికి గడియ పెట్టుకున్నారు. పోలీసులను లోపలికి రానిచ్చేది లేదని బండారు సత్యనారాయణ భీష్మించుకుని కూర్చున్నారు. కాగా, తలుపులు బద్దలుకొట్టి అయినా సరే.. లోపలికి వెళ్లి బండారు సత్యనారాయణకి నోటీసులు ఇవ్వాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే పరిస్థితి నెలకొంది. బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్ టార్గెట్?
అటు టీడీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కచ్చితంగా బండారు అరెస్ట్ ను తాము అడ్డుకుని తీరతామని పోలీసులకు టీడీపీ కార్యకర్తలు చాలెంజ్ విసురుతున్న పరిస్థితి ఉంది. అర్థరాత్రి నుంచి కూడా హైడ్రామా నెలకొని ఉంది. బండారును అరెస్ట్ చేస్తారని తెలియగానే పెందుర్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బండారు సత్యనారాయణ ఇంటి చుట్టూ టీడీపీ శ్రేణులు మోహరించి ఉన్నాయి. పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో బండారు సత్యనారాయణ ఇంట్లోకి వెళ్లనిచ్చేది లేదని టీడీపీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.
పోలీసుల తీరుపై టీడీపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. పోలీసుల వైఖరిని అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావు ఖండించారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read..Botsa : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?
అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గాంధీ జయంతి సందర్భంగా ఉదయం నుంచి సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు బండారు సత్యనారాయణ. ఆయన తన ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన షుగర్ లెవెల్స్, బీపీ డౌన్ అయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ ను తీసుకొచ్చారు. అంబులెన్స్ ను లోపలికి పంపాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. అంబులెన్స్ కు దారిచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తొలగించారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు. నిజంగానే బండారు సత్యనారాయణకు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి ఉంటే ప్రభుత్వ డాక్టర్ ను తీసుకొచ్చి వైద్య సాయం అందిస్తామని పోలీసులు చెప్పారు.