Nara Lokesh (Photo : Twitter)
Nara Lokesh – Jobs : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరులో పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏమేం చేస్తామో వివరించారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు లోకేశ్. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇక, ఉద్యోగం వచ్చే వరకు యువగళం నిధి కింద యువతకు రూ.3వేల పెన్షన్ ఇస్తామని లోకేశ్ చెప్పారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రహదార్లను యుద్ధప్రాతిపదికన పునర్ నిర్మిస్తామన్నారాయన. జగన్ సర్కార్ పై లోకేశ్ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. అభివృద్ది అన్నది లేకుండా పోయిందన్నారు.
” సీఎం జగన్ కు దోచుకోవడం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రద్ధ లేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో టెండర్లు పిలచినా పరారవుతున్నారు. టీడీపీ వచ్చాక గుండ్లపాడు-కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును 4 లైన్లుగా మార్చుతాం.
జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీ లేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు. బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గూండాలు, రౌడీలతో గొంతు నొక్కుతున్నారు. అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు. స్కూళ్ల విలీనంతో పేదలకు విద్యను దూరం చేస్తున్నారు జగన్. సంస్కరణల పేరుతో విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో వేల కోట్లు దోచుకోవడం తప్ప విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు” అని లోకేశ్ ధ్వజమెత్తారు.
Also Read..Rajini Vidadala : దమ్ముంటే రండి.. చంద్రబాబు, లోకేశ్కు మహిళా మంత్రి ఓపెన్ చాలెంజ్