Srisailam Bhramaramba : తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి.
నల్లమల అడవులు చల్లని గాలులతో స్వాగతం పలుకుతున్నాయి. అన్నదాతలు ఆహారపానీయాలు అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులు కల్పించి భరోసా కల్పిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు తరలివస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది.