పక్కా ప్లాన్ ప్రకారం వరలక్ష్మి హత్య.. కీలక విషయం వెలుగులోకి!

  • Publish Date - November 1, 2020 / 02:11 PM IST

విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పథకం ప్రకారమే అఖిల్ వరలక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల చెబుతున్నారు. యువతి హత్యకు కారణం ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే అని అంటున్నారు.



వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టి నాయుడు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసిన వరలక్ష్మీ(17)కి అఖిల్‌(21)‌తో కొంతకాలంగా పరిచయం ఉంది.



ఓవైపు అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటూనే.. మరో వైపు రాము అనే యువకుడితో వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటం భరించలేక పథకం ప్రకారం ఆఖిల్ యువతిని హత్య చేశాడు. ఓ విషయం కోసం మాట్లాడేందుకు అఖిల్, రాముతో కలిసి వరలక్ష్మీని సాయిబాబా గుడి వద్దకు పిలిచాడు. అక్కడ ముగ్గురూ ఈ వ్యవహారంలో మాట్లాడుకుంటడగా కోపం తట్టుకోలేక అఖిల్ తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో వరలక్ష్మి గొంతుకోశాడు. గుడికి వెళ్లేముందే బ్లేడ్ తీసుకుని వచ్చి ఈ చర్యకు పాల్పడ్డాడు అఖిల్.



ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. కఠిన చర్యలకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు