Kodi Katti Case: కోడి కత్తి కేసు శ్రీను భోజనం చేశాడు: జైలు సూపరింటెండెంట్
శ్రీనివాస్ తల్లిదండ్రులు బయట నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి అతడు చేయవలసిన అవసరం...
- T Venkateshwarlu
- Published On : January 18, 2024 / 04:39 PM IST
Kodi Katti case
Kodi Katti Case: కోడి కత్తి కేసులో రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లి శ్రీనివాస్ జైలులో భోజనం చేసినట్లు తమ సిబ్బంది చెప్పారని విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ అమాయకుడని అతడిని విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సావిత్రమ్మ, సుబ్బరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, పోలీసుల అనుమతి లేకపోవడంతో సావిత్రి, సుబ్బరాజు ఇంట్లోనే దీక్షకు దిగారు. కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనుపల్లి శ్రీనివాస్ కూడా విశాఖ సెంట్రల్ జైలులోనే దీక్షకు దిగుతాడని వారు అన్నారు.
దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస్ తల్లిదండ్రులు బయట నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి అతడు చేయవలసిన అవసరం లేదని తాము అతడికి చెప్పామని అన్నారు. జైల్లో దీక్ష చేయాలంటే కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్తో చెప్పామన్నారు.
కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఇక్కడ దీక్ష చేయవచ్చని కూడా అతడికి తెలియజేశామని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు తీసుకున్న తర్వాతనే తను ఇక్కడ నిరాహారదీక్ష చేయడానికి అనుమతి ఉంటుందని అన్నారు. జైల్లో దీక్ష చేసేందుకు అయితే తాము అనుమతి ఇవ్వలేదని వివరించారు. నిరాహార దీక్ష చేస్తానంటూ తమను అనుమతి కోరాడని అన్నారు. కోర్టు ద్వారానే అనుమతి ఇవ్వగలమని తాము చెప్పామని వివరించారు.
