AP Rains : ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. వరదలతో ఉలిక్కి పడింది. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకునిఉన్న మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఉత్తర దిశగా కదులుతూ ఇవాళ ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం కారణంగా ఉత్తరకోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : Brahmaji – YS Jagan : వైఎస్ జగన్ పై బ్రహ్మాజీ సంచలన ట్వీట్.. తర్వాత ట్విట్టర్ హ్యాక్ అయిందంటూ..
అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో ఆ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి కోలుకుంటున్న విజయవాడ వాసులను వాతావరణశాఖ హెచ్చరిలకు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్టణం, కోనసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.