Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు దంచికొట్టనున్న వానలు.. పిడుగులు పడతాయ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Rain Alert
- తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
- అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
- పిడుగులు పడే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని సూచన
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవైపు మధ్యాహ్నం సమయంలో ఎండ సుర్రుమనిపిస్తుండగా.. మరోవైపు సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read : Iran vs Israel War : యుద్ధంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్! హర్ముజ్ జలసంధికి లైన్ క్లియర్!
తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. పిడుగులు కూడా పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (బుధవారం) ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా.. బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడ్రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మలుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతులు పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రబీలో రైతులు సాగు చేసిన పంటలు కోత దశలో ఉన్నాయి. పలు పంటల ఉత్పత్తులు కల్లాల్లో ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
